
మేల్ వెణ్ ప్పాకం శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ క్షేత్ర వైభవం.
భార్గవ మహర్షి సత్యయుగంలో తపమాచరించి శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం వరముగా పొందిన క్షేత్రం.
ఆ స్తోత్రం జపించడం ద్వారా శ్రీ లక్ష్మీ నారాయణులు భార్గవ మహర్షికి దర్శనమిచ్చారు.
శంఖ,చక్రాలను ధరించి అభయముద్రతో లక్ష్మీ సహితుడై
చిరు మందహాసముతో దర్శనమిచ్చి. భార్గవ మహర్షి కోరిన కోరిక ప్రకారం లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం ఆవిర్భావ క్షేత్రంలోనే వెలసి భక్తులను అనుగ్రహించునట్లుగా వరమిచ్చెను.
సత్యయుగంలో పదకొండు అడుగుల స్వరూపంతో అర్చామూర్తిగా(సాలగ్రామ మూర్తిగా) దర్శనమిచ్చిన స్వామి, ధర్మం క్షీణించిన కొద్దీ
త్రేతాయుగంలో తొమ్మిది అడుగులతో
ద్వాపరయుగంలో ఆరు అడుగులతో
ప్రస్తుతం ఈ కలియుగంలో రెండున్నర అడుగుల స్వరూపంతో మనం దర్శించవచ్చు.
నాలుగు యుగములుగా ఈ క్షేత్రం లో వెలసి యుగధర్మాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటూ భక్తసులభుడిగా ఉన్నందున స్వామిని
*యుగనారయణ స్వామి*
అనే పేరుతో పిలుస్తారు.
అమ్మవారు ప్రధానంగా ఉన్నటువంటి క్షేత్రాలలో అతి ముఖ్యమైన క్షేత్రం.
ఏ క్షేత్రంలో అయినా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి అంటే స్వామి అనుమతి ఉండాలి.
అనుమతి ఉన్నప్పటికీ ఒక్క వరం మాత్రమే అనుగ్రహిస్తారు.
కానీ మేల్ వెణ్ ప్పాకం క్షేత్రంలో అష్టలక్ష్ములూ ఏకమై ఒకే రూపంలో ఉంటూ స్వామి అనుమతి లేకుండా ఒకే సమయంలో మూడు వరములను అనుగ్రహిస్తారు.
అందువలన ఈ క్షేత్రం లో అమ్మవారిని
*స్వతంత్ర లక్ష్మీ* అనే నామంతో పిలుస్తారు.

శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీయుగనారాయణ పరబ్రహ్మణే నమః
శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీయుగనారాయణ స్వామివారు సత్యయుగంలో ఇక్కడ వెలసినప్పటినుండి
ఈ క్షణం వరకూ సప్తర్షులు
(అత్రి, భృగు,కుత్స,వశిష్ఠ,గౌతమ,కాశ్యప,అంగీరస)
నిత్యం ఆ దివ్య దంపతులనూ స్తుతిస్తూ ఉండటం వలన
మేల్ వెణ్ ప్పాకం తపోక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ఏ క్షేత్రంలోనూ లేనటువంటి ఆశ్చర్యకరమైన విషయం
స్వామి యొక్క దృష్టి అమ్మవారి చూపులు సమానంగా భక్తులపై ప్రసరించే అద్భుత దృశ్యం ఇక్కడ చూడవచ్చు
వారిరువురి కరుణా కటాక్ష వీక్షణలు మనపై ప్రసరిస్తే ఏం విశేషం?
క్షీరసాగర మథనం తరువాత పదవీకాంక్షతో ఇంద్రుడు ఈ విధంగా అమ్మవారిని స్తుతించాడు.
ధారాపుత్రస్తస్తదాగార సుహృద్ధాన్య ధనాధికం |
భవేత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణాత్ నృణాం ||
వివాహం, సత్సంతానం, గృహం,బంధు-మితృలు అత్యధికంగా ధన-ధాన్యములు అన్నీ నిత్యం అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు ఎవరిపై ప్రసరిస్తారో వారికి సకల సౌక్యములు లభిస్తాయి.

కావున క్షేత్రమునకు శీఘ్ర వివాహం కొరుకు, సత్సంతానం, అన్యోన్య దాంపత్యం కోసం,ఉన్నత పదవి/అధికార ప్రాప్తి, వ్యాపార లాభం,ఋణం బాధలు తొలగుటకు వేల కొలది భక్తులు విచ్చేస్తుంటారు.
త్రేతాయుగంలో శ్రీరాములవారి ఆదేశానుసారం శ్రీ ఆంజనేయ స్వామి మూడు మండలాల (48×3=144) కాలం తపమాచరించిన క్షేత్రం. ఇప్పుడు కలియుగంలో యోగాంజనేయ స్వామిగా మనం దర్శించవచ్చు.
జా తకంలోని దోషములు తొలగుటకు స్వామివారి తిరుమంజనం (అభిషేకం) దర్శనం కోసం భక్తులు విచ్చేస్తుంటారు.
కాలసర్పదోషం, వివాహ ఆలస్యం, సంతాన ఆలస్యం, కుజదోషం ఉన్నవారు శ్రీ యుగనారాయణ స్వామివారి తిరుమంజనం సమయంలో,
వైజయంతి మాలగా స్వామి వారి వక్షస్థలంపై ఉన్న ఆదిశేషుని దర్శించడం వలన సకల దోషములు నివారణమగును. సకాలంలో వివాహం, సత్సంతానం, అన్యోన్య దాంపత్యం ,ధన-ధాన్య సమృద్ధి కలిగి సకల సౌఖ్యములను పొందెదరు.

జాతకంలోని అత్యంత ప్రమాదకరమైన దోషనివారణ లేని కాలసర్పదోషం శ్రీక్షేత్రంలో స్వామివారి దర్శన మాత్రంతోనే నివారణమగును.
పూర్వం ఎందరో రాజులు వైభవంగా తీర్చిదిద్దగా పదకొండు రాజగోపురాలతో రారాజిస్తూన్నటువంటి ఈ క్షేత్రంపై మ్లేచ్చులు దండయాత్రకు రాగా ఆ సమయంలో ఈ క్షేత్రంలో స్వామివారి సేవలో పాల్గొన్న శ్రీఉపనిషద్బ్రహ్మేంద్ర మఠం స్వామివారు మూలమూర్తిని రక్షించుకోవడానికి మైసూరుకు తరలివెళ్లారు.
శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీ యుగనారాయణ స్వామివారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని రాజుగారికి స్వామివారిపై అపారమైన భక్తి.
స్వామివారికి విశాలమైన ఎత్తైన ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించాలని తమ కోరికగా శ్రీఉపనిషద్బ్రహ్మేంద్ర మఠం స్వామివారికి తెలియజేయగా.
శ్రీ ఉపనిషద్బ్రహ్మేంద్ర మఠం స్వామివారు శ్రీ లక్ష్మీ నారాయణుడికి విన్నవించారు.
అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈవిధంగా పలికెను భరతభూమిలో పద్దెనిమిది క్షేత్రాలలో సాలగ్రామ మూర్తిగా ఆవిర్భవించి ఎనిమిది క్షేత్రాలలో అశిల్పికరంగా (స్వయంభూ/ ఏ శిల్పి చేత చెక్కబడకుండా) ఉన్నప్పటికీ అందులో దంపతులుగా మొట్టమొదటి సారిగా దర్శనమిచ్చిన క్షేత్రం .
శ్రీ లక్ష్మీ నారాయణ హృదయం స్ తోత్రం ఆవిర్భావించిన ఆ క్షేత్రం మాకు అత్యంత ప్రీతికరమైనది కావున తక్షణమే మనం మేల్ వెణ్ ప్పాకం చేరుకోవాలని ఆదేశించారు.
ఈ మాటలు విన్న ఆ రాజుగారు చాలా దుఃఖించారు.
స్వామి ఆదేశానుసారం వారు మేల్ వెణ్ ప్పాకం చేరుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసాడు.
శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత శ్రీ యుగనారాయణ స్వామివారిని మేల్ వెణ్ ప్పాకం క్షేత్రంలో మూల స్థానంలో చిన్న సన్నిధిలో ఆగమోక్తంగా ప్రతిష్ఠాదులుగావించి నిత్యపూజలను శ్రద్ధగా రహస్యంగా మఠం ప్రాకారం లోపలనే జరిపిస్తూ వచ్చారు.
1957 వ సంవత్సరంలో శ్రీకంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి(పరమాచార్య స్వామి) వారు ఈ క్షేత్రమును దర్శించి ,
స్వయంగా స్వామివారే మూడురోజులు శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ళను అర్చించారు.
క్షేత్ర వైభవమే స్వామివారి మూడురోజుల అనుగ్రహ భాషణం (ఉపన్యాసం/ప్రవచనం).
ఇలా జరుగుతున్న కొద్ది రోజులలోనే కారణాంతరాల చేత నలభై సంవత్సరాలు ఆలయంలో పూజాదికాలు నిలిచిపోయాయి, అక్కడి గ్రామ ప్రజలు ఆలయం ఉన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయారు.

ఆ దివ్య క్షేత్రమును ఇప్పుడు దర్శించడం ఎలా?
ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి?

నంగనల్లూర్ లోని శ్రీమతి.సరస్వతీ శ్రీ మణివణ్ణన్ దంపతులు సంతానార్థం నిత్యం వ్రతాలు,పరిహార పూజలు, తీర్థయాత్రలు చేస్తూ తమ దుఃఖాన్ని భగవంతునికి తెలియజేసే వారు.
కొన్ని సంవత్సరాల తరువాత కలలో భగవద్ధర్శనం కలిగినది .
తనని దర్శించి అర్చించిన సత్సంతానం కలుగునని భగవత్సందేశం .
తక్షణమే ఆ దంపతులు స్వామి దర్శనార్థం అనేక దేవాలయాలను సందర్శించారు కానీ వీరికి కలలో కనిపించిన స్వామి దర్శనం కలగలేదు.
దుఃఖంతో ఒక మహాత్ములని కలిసి తమకి కలిగిన ఈ భగవత్ శోధన గురించి వివరించి పరితపించారు.
మహాత్ముల దర్శనం వృధాగా పోదు.
అప్పుడు వారు తమ జ్ఞానదృష్ఠితో చూసి వీరికి మార్గోపదేశం చేసారు.
నీవు పూర్వ జన్మలో ఉత్తముడైన విష్ణు భక్తుడువి స్వామికి దివ్యమైన మందిరాన్ని నిర్మించాలని ఆశించి అది నెరవేరక
అంత్యక్షణంలో అదే చింతిస్తూ దేహత్యాగం చేయడం వలన జన్మ రాహిత్యమైన మోక్షం లభించవలసినది,
కానీ నీ భక్తికి ఆ శ్రీహరి నీచే మందిర నిర్మాణంగావించి
సకల సేవలను అందుకోవాలని మరల ఈ జన్మమును ప్రసాదించారు.
ఇప్పుడు ఆ స్వామి మీ పూర్వీకుల స్వగ్రామంలో ఉన్నారు వెళ్లి దర్శించండి అని తెలియజేశారు.
అయితే ఈ దంపతులకు తమ పూర్వీకుల స్వగ్రామం ఎక్కడో తెలియదు .
చాలా కష్టపడి వెతకగా మేల్ వెణ్ ప్పాకంలో తమ పూర్వీకులు నివసించినట్టుగా తెలుస్తుంది.
తక్షణమే ఆ గ్రామం చేరుకున్నారు .
గ్రామంలో ఎక్కడా ఆలయం యొక్క ఆనవాళ్ళు తెలియలేదు ,ఆ గ్రామ ప్రజలను విచారిస్తే ఆలయం గురించి ఎవ్వరికీ తెలియదు.
నిరాశతో వెనుదిరిగుతున్నప్పుడు అక్కడ ఉన్న గోమాతను నమస్కరించి ముందుకు రాగానే పురాతనమైన చిన్న మండపం కనిపించింది అందులో ఏముందో చూడాలని
వెళ్ళారు.
మొత్తం చీకటి ఏమీ కనబడుట లేదు.
మంచి సుగంధ భరితమైన సువాసన చాలా బాగుంది ఎన్నడూ ఇటువంటి సువాసనను ఆఘ్రాణించలేదు.
లోపల ఏముందో చూడాలని ఒక దీపాన్ని వెలిగించి తీసుకుని వెళ్లి ఆ దీపం వెలుగులొ చూడగా.
ప్రసన్నవదనంతో చతుర్భుజాలతో లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన రూపంలో ప్రత్యక్షం గా చూడగానే వారికి నమ్మశక్యం కాలేదు .
గ్రామంలో వారినందరినీ పిలిచి స్వామిని చూపించారు.
యధాశక్తి పూజలు నిర్వహించారు.
ఈ క్షేత్ర వైభవం తెలుసుకొనుటకు తమకు అన్ని విధాలా సహకరిస్తారని పాండిచ్చేరి ప్రధాన కార్యదర్శి గారు
శ్రీ మాన్.ఉ.వే.శ్రీ.R.S.చార్యార్ స్వామిని కలిసారు.
ఆశ్చర్యం ఏమిటంటే చాలా సంవత్సరాలుగా లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం ఆవిర్భావ క్షేత్రం కోసం తాళపత్రాలు పట్టుకుని ఎన్నో క్షేత్రాలను సందర్శించారు.
వీరు విషయం తెలియజేయగానే తక్షణమే క్షేత్రమునకు విచ్చేసి తాళపత్రాలలోని ఆనవాళ్ళను పరీక్షించి చూడగా
సాక్షాత్తూ శ్రీ లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం ఆవిర్భావించిన ప్రదేశం, శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత యుగనారాయణ స్వామివారి క్షేత్రం అని ప్రామాణికంగా తెలిసినది.
శుభముహూర్తాన దేవస్థాన జీర్ణోద్ధరణ ప్రారంభించి నిర్విఘ్నంగా పూర్తిచేసి.
స్వామి తిరునక్షత్రమయిన ఆణిఉత్తరాడం(ఉత్తరాషాడ నక్షత్రం) రోజున ప్రతిష్టామహోత్సవాన్ని జరిపించారు.
శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత యుగనారాయణ స్వామివారి అనుగ్రహంతో ఆ దివ్య దంపతులకు ఒక కుమార్తె జన్మించింది
ఎందరో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ ఇష్టార్థములను నెరవేర్చుకుంటున్నారు.
*మహాత్ములు దర్శించిన మేల్ వెణ్ ప్పాకం*
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
(కంచి పరమాచార్య స్వామి వారు)
తమ అనుగ్రహ భాషణంలో ఈ శరీరంతో వైకుంఠం చేరి మన కళ్ళతో ఆ భగవంతుడిని చూడలేము, అలా చూడాలనే కోరిక కలిగినవారు మేల్ వెణ్ ప్పాకం సన్నిధిలో సాక్షాత్ వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడిని ప్రత్యక్షంగా దర్శించవచ్చు.
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ప్రధానంగా ఉన్నటువంటి క్షేత్రం మాకు అత్యంత ప్రీతికరమైనది అని భక్తులకు తెలియజేశారు.
**మహాత్మ.శ్రీ శ్రీ అణ్ణా (శ్రీ కృష్ణప్రేమి అణ్ణా భగవదంశ సంభూతులు)
శ్రీ క్షేత్రమును దర్శించుటకు దేవేంద్రాదులు స్వామి అనుమతి కోసం క్షేత్రం వెలుపల వేచి చూస్తున్నారు.
అష్టసిద్ధులు కలిగిన సిద్ధపురుషులు , మహర్షులు దేహత్యాగానంతరం కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠాది పరమపదమునకు చేరాలని ఆశించడం సహజం .
కానీ శరీరంతో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత యుగనారాయణ స్వామివారిని దర్శించాలని నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు.
దేవతలకి, మహర్షులకు అసాధ్యమైన భగవద్ధర్శనం కలియుగంలో మనకు సులువుగా లభిస్తుంది అంటే స్వామి ఎంతటి కరుణామూర్తి అని వర్ణించడానికి సాధ్యం కాదు.

**జ్యోతిష్య చక్రవర్తి.శ్రీమాన్.ఉ.వే.శ్రీ.A.M.రాజగోపాలన్ స్వామి.
ఎంతో గొప్ప పుణ్యం చేసిఉండాలి లేక భగవ ంతుడికి మన పైన కరుణ కలగాలి అప్పుడు మాత్రమే శ్రీ మేల్ వెణ్ ప్పాకం క్షేత్రంలో శ్రీ స్వతంత్ర లక్ష్మీ నాయికా సమేత యుగనారాయణ స్వామివారిని దర్శించుకోగలుతాము
లేదంటే ఈ దేవస్థానం గోపురం కూడా చూడలేరు.
జాతకంలో అత్యంత ప్రమాదకరమైన దోషం కాలసర్పదోషం .
ఈ దోష నివారణ చాలా కష్టమైనది అటువంటి దోషం శ్రీ క్షేత్రం దర్శనమాత్రంతోనే నివారణ మగును.
పన్నెండు రాశులకు సకల దోషములను నివారణ ,
ప్రారబ్ధ కర్మములు తొలగించి సకల సౌఖ్యములను కలుగజేసే క్షేత్రం.
శ్రీ లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం పారాయణం వలన
సకల సౌఖ్యములను కలుగును.
ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే తిరుమంజనం (అభిషేకం) సమయంలో మాత్రమే ఆదిశేషుని దర్శించవచ్చు.
క్షేత్ర ప్రసాదం పాలపాయసం భక్తులకు వినియోగం చేస్తారు.
**స్వామి తిరునక్షత్రం ఉత్తరాషాడం.
ప్రతి మాసంలో ఉత్తరాషాడ నక్షత్రం రోజున
05:00 సుప్రభాతం
05:30 అభిషేకం
06:30 గో పూజ
07:00 ప్రసాద వినియోగం
07:30 హోమం ప్రారంభం ( విశేషంగా ఎనిమిది హోమాలను నిర్వహిస్తారు.
శ్రీ లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం మూల మంత్ర హోమం
శ్రీ సుదర్శన హోమం
శ్రీ ధన్వంతరి హోమం
శ్రీ ఆవహంతీ హోమం
శ్రీ లక్ష్మీ నారాయణ మూల మంత్ర హోమం
పురుష సూక్త హోమం
శ్రీ సూక్త హోమం
శ్రీ సంతాన గోపాల హోమం)
10:30 శ్రీ లక్ష్మీ నారాయణ హృదయం స్తోత్రం పారాయణం
11:15 శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకళ్యాణ గోవిందరాజ స్వామివారి కళ్యాణమహోత్సవం
01:00 ప్రసాద వినియోగం

